top of page

రావి చెట్టు(అశ్వద్థవృక్ష)మహిమ - Ravi Tree (Aswadtha Vriksha / Peepal Tree/ Pimple Tree/ Pipala Tree/

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

రావి చెట్టు(అశ్వద్థవృక్ష)మహిమ


➖➖➖✍️


దేవతా వృక్షాల్లో రావి(అశ్వత్థం) ఒకటి.


అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. అందువల్లనే ‘అశ్వత్థ నారాయణుడు’ అనే పేరు కూడా ఆయనకు ఉంది.


సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయటపడింది. దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భంలో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురా ణాలు చెబుతున్నాయి.


ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందున దానికి పవిత్రత వచ్చిందని చెబుతారు.


కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతారు.


స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలుకు గాని దాని కొమ్మలకు గాని ఎర్రవస్త్త్రం గాని, ఎర్ర దారం గాని కట్టే ఆచారం ఉంది.


ఏ చెట్టును నరకడమైనా పాపమే కాగా అశ్వత్థ వృక్షాన్ని నరకడం మహాపాపమని ఒక పురాణ వచనం.


బుద్ధునికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం అయిందని చెబుతారు. అందువల్ల వారు దానిని బోధి వృక్షమని, జ్ఞాన వృక్షమని వ్యవహరిస్తారు.


రావి సమిధలతో హోమంచేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి. రావి చెక్కకాషాయాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వాత రక్త దోషాలు తగ్గుతాయి.


నోటిపూత పోవును. రావి చెక్కకషాయాన్నిరోజు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కాలేయ సమస్యలు ఉండవు. వివిధ కఫ దోషాలను రూపుమాపును.


అశ్వత్ధ వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండపురాణము లో నారదుడు వివరించెను. అశ్వత్థమే నారాయణ స్వరూపము.


ఆ వృక్షం యొక్క మూలము – బ్రహ్మ, దాని మధ్య భాగమే – విష్ణువు, దాని చివరి భాగము – శివుడు. కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించి నట్లే.


ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కునగల కొమ్మలలో ఇంద్రాదిదేవతలు, సప్తసముద్రాలు, అన్ని పుణ్యనదులు ఉంటాయి. దాని వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మలు, నాలుగువేదాలు ఉంటాయి.


అశ్వత్థ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాధిపతులు, దిక్పాలకులు ఎల్లప్పుడు ఉంటారు.అశ్వత్థ వృక్షం మూలములో ‘అ’ కారము, మానులో ‘ఉ ‘ కారము, అది ఇచ్చే పళ్ళలో ‘మ’ కరము, వెరసి ఆ వృక్షమంతా ప్రణవస్వరూపమే. అశ్వత్థ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షము.


ప్రదక్షణ మరియు పూజించు విధానము :


ముందుగా అశ్వత్థ వృక్షాన్ని దర్శించి దానిని చేతితోతాకి ఈ క్రింది అశ్వత్థ వృక్ష స్తోత్రమును పఠించాలి.



అశ్వత్ధవృక్ష స్తోత్రం....



మూలతో బ్రహ్మరూపాయ


మధ్యతో విష్ణురూపిణే


అగ్రత శ్శివరూపాయ


వృక్షరాజయతే నమః



అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ చైత్ర, ఆషాడ, పుష్య మాసాలలో చేయరాదు. గురు, శుక్ర మౌడ్యాలలో చేయరాదు. కృష్ణపక్షం లో అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ ప్రారంభించరాదు.



ఆది,సోమ,శుక్రవారాలలో, గ్రహణ మరియు సంక్రమణ సమయాల్లో, నిషిద్ధ సమయాల్లో, రాత్రి భోజనముచేసి యీ వృక్షాన్ని సేవించరాదు.


మౌనంగా లేదా గురునామము లేదా విష్ణుసహస్రనామమును చదువుతూ నెమ్మదిగా ప్రదక్షణలు చేయాలి. ప్రతి ప్రదక్షణానికి ముందు అలాగే చివర అశ్వత్థ వృక్షానికి నమస్కరించాలి.



అశ్వత్ధ వృక్ష పూజా ఫలము :


అశ్వత్ధ వృక్షానికి రెండు లక్షల ప్రదక్షణాలు చేస్తే సర్వపాపాలూ నశించి నాలుగుపురుషార్ధాలు సిద్ధిస్తాయి. బిడ్డలు కలగాలన్న సంకల్పముతో ప్రదక్షణలు చేస్తే తప్పక కలుగుతారు.


శనివారంనాడు అశ్వత్థ వృక్షాన్ని చేతితోతాకి మహామృత్యుంజయ మంత్రమును జపిస్తే మృత్యుభయం పోతుంది. అలాగే శనివారంనాడు అశ్వత్థ వృక్షాన్ని చేతితోతాకి ఈ క్రింది శనైశ్చర స్తోత్రమును పఠించిన శనిదోషం తొలగిపోతుంది.



అశ్వత్థ వృక్షం క్రింద చెప్పవలసిన శనైశ్చర స్తోత్రం:


కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రాంతకోయమః


శౌరీ శ్శనైశ్చరో మందః పిప్పిల దేవ సంస్తుతః



గురువారం, అమావాస్య కలసి వచ్చిన రోజున అశ్వత్థ వృక్షం క్రింద వేదవిప్రునికి భోజనము పెడితే కోటిమంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితముంటుంది.


గురువారం, అమావాస్య కలసి వచ్చిన రోజున అశ్వత్థ వృక్షనీడలో స్నాన మాచరించిన మహాపాపములు తొలగును.


అశ్వత్థ వృక్షం క్రింద చదివిన గాయత్రి మంత్రజపం నాలుగువేదాలు చదివిన ఫలితాన్ని ఇస్తుంది.



అశ్వత్థ వృక్షాన్ని స్థాపిస్తే నలభై రెండు తరాలు వారికి స్వర్గం లభిస్తుంది..✍️


. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు


🌷🙏🌷



🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀




コメント


  • Facebook
  • Twitter
  • LinkedIn

©2023 by Dailybhaktimessages2. Proudly created with Wix.com

bottom of page