top of page

తోకకు గంటవున్న హనుమంతునికి పూజ (Worship of Hanuman with a bell on his tail.)

Writer: Prasad Bharadwaj
Prasad Bharadwaj
Sep 1
2 min read

తోకకు గంటవున్న హనుమంతునికి పూజ


Worship of Hanuman with a bell on his tail.


ఆంజనేయ స్వామి మహిమలు గురించి మనకు రామాయణం ద్వారా వాల్మీకి ఎంతో అద్భుతంగా తెలియజేశారు. రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతో ఉంది.


పినతల్లి కోరిక మేరకు తండ్రి ఆజ్ఞ మేరకు 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళిన శ్రీరామచంద్రుడు ఎన్నో అష్టకష్టాలు పడ్డారు. ఇలా ఆ కష్టాలలో రాముడి వెంట నిలిచిన ఆంజనేయుని మహిమలు గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంజనేయస్వామిని వివిధ రకాల పేర్లతో, ఆకారాలతో పిలిచి పూజిస్తారు. ఇలా ఆంజనేయ స్వామి ఆకారాలలో ఒకటి స్వామివారి తోకకు గంట ఉంటూ భక్తులకు దర్శనం కల్పిస్తుంటారు.


తండ్రి ఆజ్ఞ మేరకు వనవాసం వెళ్లిన శ్రీరామచంద్రుడు అక్కడ సీతాపహరణ జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇలా సీతాపహరణ జరిగిన తర్వాత వానరుల సైన్యంతో శ్రీరామచంద్రుడు లంకపై యుద్ధానికి వెళ్తాడు. అయితే ఈ యుద్ధంలో పాల్గొనడం కోసం ఎంతో మంది వానరులు వారి కుటుంబ సభ్యులకు బాధతో, యుద్ధంలో పాల్గొనటానికి వెళ్తూ ఉన్న సమయంలో శ్రీరామచంద్రుడు తన కోసం వీరి ప్రేమను త్యాగం చేస్తున్నారని భావించి అక్కడ ఉన్న వానరులకు మాట ఇస్తారు.


యుద్ధభూమికి ఎంత మంది అయితే వానరులు వెళ్తున్నారో అంతే మంది తిరిగి వస్తారని ఎవరి ప్రాణాలకి ఎలాంటి హానీ జరగకుండా తీసుకువస్తానని శ్రీరామచంద్రుడు మాట ఇచ్చారు.అయితే ఈ యుద్ధంలో వెయ్యి సింగలీక (మరుగుజ్జు కోతులు) పాల్గొన్నాయి. ఇలా యుద్ధభూమిలో భయంకరంగా పోరాటం జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామచంద్రుడు అతని సైన్యం రావణ సైన్యాన్ని మట్టుబెట్టారు.


ఇక చివరికి మిగిలింది కుంభకర్ణుడు, రావణాసురుడు మాత్రమే. ఇక కుంభకర్ణుడు భారీ దేహం గురించి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కుంభకర్ణుడు ఎంతో పెద్దదైన రథం పై కూర్చొని యుద్ధ భూమిలోకి అడుగు పెడతారు. ఈక్రమంలోనే రాముడు తన బాణంతో కుంభకర్ణుడిని సంహరించగా ఆయన కింద పడుతున్న సమయంలో చేయి రథానికి తగులుతుంది.


ఇలా కుంభకర్ణుడు చేయి రథానికి తగలగానే రథానికి అలంకరించి ఉన్న ఒక గంట కింద పడుతుంది. ఈ గంట కింద సింగలీక వానర సైన్యం వేయి మంది పడటం వల్ల ఒక్కసారిగా చీకటి కమ్ముకుంటుంది. బయట ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉన్న ఆ వానర సైన్యం వారి గురించి పట్టించుకునే వారే లేరని రాముడిని ఇష్టానుసారంగా మాట్లాడుతూ అవహేళన చేస్తారు.కానీ అందులో కొన్ని కోతులు రాముడే రక్షిస్తాడని శ్రీరామ తారక మంత్రం జపిస్తూ ఉంటాయి. కొంతకాలానికి అన్నికోతులూ శ్రీరామ తారక మంత్రం జపిస్తూ ఉంటాయి.


యుద్ధం ముగిసిన తర్వాత వానర సైన్యాన్ని లెక్కించమని శ్రీరాముడు సుగ్రీవుడికి చెప్పగా వారిలో వెయ్యి మంది తక్కువ వస్తారు.మరొకసారి లెక్కించాలని చెప్పడంతో మరొకసారి లెక్కించిన సంఖ్య తక్కువగా ఉండడంతో స్వయంగా రాముడు రంగంలోకి దిగి వారి కోసం వెతకసాగాడు.


ఇలా ఆ వెయ్యి వానరుల కోసం వెతుకుతున్న సమయంలో శ్రీరాముడి చూపు ఆ గంట పై పడింది.వెంటనే శ్రీరాముడు హనుమ అని అనగా అతని మనసులో భావం అర్థం చేసుకున్న ఆంజనేయుడు తన తోక ద్వారా గంటను పైకి లేపాడు. ఇలా గంట కింద వెయ్యి మంది వానరులు శ్రీరామ తారక మంత్రం జపిస్తూ వుంటారు. వేయి మంది ఉండడంతో లెక్క సరిపోయిందని చెబుతాడు. అప్పటివరకు చీకటిలో ఉన్న ఆ వానరులకు ఒక్కసారిగా వెలుతురు చూస్తూ అందులో శ్రీరాముడిని చూడగానే శ్రీ రాముడి పట్ల వారు భావన తప్పు అని వెంటనే శ్రీరామచంద్రుడి కాళ్ళపై పడి శరణు వేడారు.


వారిని ఆశీర్వదించిన శ్రీరామచంద్రుడు ఇప్పటినుంచి ఆంజనేయ స్వామి తోక వెనుక భాగాన గంట ఉన్న రూపంలో ఆంజనేయుడిని ఎవరైతే పూజిస్తారో వారి పై ఆంజనేయుడి కృప తోపాటు నా అనుగ్రహం నా కృప రెండింతలు ఉంటుందని శ్రీరామచంద్రుడు తెలిపారు.


అప్పటినుండి ఇతర ఆంజనేయ అవతారాలను పూజిస్తే వచ్చే ఫలితంకంటే ఆంజనేయుడి తోక వెనుకభాగం గంట ఉండే రూపాన్ని పూజిస్తే హనుమంతుడి అధిక కృపతోపాటు శ్రీరాముడి అనుగ్రహం కూడా అధికంగా పొందవచ్చని రామాయణం చెబుతోంది.


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page