top of page

గట్టమ్మ ఆలయం.. Gattamma Temple..

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Jan 28
  • 2 min read

🌹 గట్టమ్మ ఆలయం.. మేడారం ప్రధాన ద్వారం ఎందుకో తెలుసా? 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Gattamma Temple.. Do you know why Medaram has the main gate? 🌹

Prasad Bharadwaj



గిరిజన వనదేవతలైన మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకున్నాకే ఆ సమ్మక్క-సారలమ్మ సన్నిధికి బయలుదేరి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది.


మేడారం ములుగు మార్గంలో ఉన్న గట్టమ్మకు తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారానికి వెళతారు. ఇంతకీ ఆ గట్టమ్మ తల్లి ఎవరు ఆ తల్లి చారిత్రక నేపథ్యం ఏంటో తెలుసుకుందామా?


కోరిన వారికి కొంగుబంగారంగా వరాలు ఇచ్చే మహిమాన్విత శక్తి దేవత గట్టమ్మతల్లి ఆలయం ములుగు జిల్లాలో ఉంది. వివిధ ప్రాంతాల్లో గట్టమ్మ తల్లికి ఆలయాలు ఉన్నప్పటికీ ములుగు గట్టమ్మ తల్లికి ఇంచుమించు సమ్మక్క, సారలమ్మ తల్లులంత వైభవం ఉంటుంది.గట్టమ్మ తల్లికి తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారానికి వెళ్తారు.ఈ ఆలయం గేట్ వే ఆఫ్ మేడారంగా ప్రసిద్ధి చెందింది. మేడారం గిరిజన రాజ్యంకోసం సాగించిన యుద్ధంలో సమ్మక్క తల్లికి గట్టమ్మ తల్లి అంగరక్షకురాలిగా ఉంది. అసమాన ధైర్య పరక్రమాలతో అనుపమ త్యాగశీలంతో శత్రువులతో రణం చేసి గొప్ప యుద్ధ వీరవనితగా పేరు తెచ్చుకొని చరిత్రకెక్కింది.


గట్టమ్మ తల్లితో పాటు అంగరక్షకులుగా సురపల్లి సురక్క,మారపల్లి మారక్క,కోడూరు లక్ష్మక్క తదితరులు సమ్మక్క తల్లిని యుద్ధంలో శత్రువుల ఆయుధాల దాడి నుంచి కాపాడుతూ తమ ప్రాణాలని పణంగా పెట్టి అమరులయ్యారు. అందుకే శ్రీ రామునికి నమ్మిన బంటుగా ఉన్న ఆంజనేయుడు, శివునికి నమ్మిన బంటుగా ఉన్న నందీశ్వరుడు పూజలు అందుకుంటున్నట్లుగా, వన దేవతలకు నమ్మిన బంటు అయిన గట్టమ్మ తల్లి సమ్మక్క సారలమ్మ తల్లులతో సమానంగా పూజలందుకుంటున్నట్లు భక్తులు చెబుతారు.


అందుకే ఈ అమరవీరులను కూడా గిరిజన దేవతలుగా మలుచుకొని వారికి గుడులు కట్టి వారి యొక్క స్మృతికి నివాళులుగా వారికి పూజలు చేస్తున్నారు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎంతోమంది ఆదివాసి కోయ గిరిజనులు అమరులైనప్పటికీ వారందరి కన్నా గట్టమ్మ తల్లికి ఎక్కువ కీర్తి దక్కింది.అదంతా కూడా గట్టమ్మతల్లికి నమ్మిన బంటు కావడం గట్టమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుంటే సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం.గట్టమ్మ తల్లికి గిరిజన పూజ సాంప్రదాయంతో నాయక పోడు పూజారులు పూజలు నిర్వహిస్తారు.


పెళ్లికాని యువతులు మంచి భర్త దొరకాలని, సంతానం లేని మహిళలు సంతానం కలగాలని, అన్నదాతల పంటలు మంచిగా పండాలని, తల్లితండ్రులు తమ పిల్లలు మంచిగా ఉండాలని, విద్యార్థులు చదువుల్లో మంచి ప్రతిభ కనబర్చి ఉద్యోగం సాధించాలని ఇలా అనేకమంది తమ సమస్యలను పరిష్కరించాలనీ గట్టమ్మ తల్లికి మొక్కుకుంటూ వరాలందుకుంటారు. అలాగే కొత్త వాహనాలు కొనుక్కున్నవారు గట్టమ్మ తల్లి వద్ద పూజలు చేయించుకుని ఆ తల్లి గద్దె చుట్టూ ప్రదక్షిణలు చేసి తల్లికి ప్రీతిపాత్రమై అనుగ్రహం పొంది తమ జీవితాల్లో విజయాలు సాధించుకుంటున్నారు. అందుకే ములుగు గట్టమ్మ తల్లి గుడి మరోశక్తిపీఠంగా ఎంతోమంది భక్తుల నిత్య పూజలు అందుకుంటోంది.


గట్టమ్మ తల్లి పూజల్ని గిరిజన పూజా సంప్రదాయంలో నాయకపోడు పూజారులు నిర్వహిస్తారు. గట్టమ్మ తల్లి దేవతను గిరిజన పూజారులు మేడారం మార్గంలోని గండికామారం, కాలువపల్లి అడవి మార్గాల్లో, జంగాలపల్లి ఆవల ములుగు ప్రేమనగర్ వద్ద ఇంకా తదితర ప్రాంతాల్లో ప్రతిష్ఠించి సమ్మక్క, సారలమ్మల దేవతల అనుబంధ దేవతగా గట్టమ్మ తల్లికి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. గట్టమ్మ తల్లి కూడా కోరినవారికి కొంగు బంగారంగా వరాలిచ్చే మహా మహిమాన్విత శక్తి దేవత అయినందున ఆ తల్లిని ఆయా ప్రాంతాల్లో నిత్యం భక్తిశ్రద్ధలతో కొలుస్తూ తల్లి దేవత కృపకు పాతృలై పలువురు భక్తులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో పాడి పంటలతో సుఖసంతోషాలతో చల్లగా వర్థిల్లుతున్నారు. దీంతో సమ్మక్క, సారలమ్మ తల్లుల భక్తులంతా గట్టమ్మ తల్లి భక్తులయ్యారు.గట్టమ్మ తల్లి కూడా కోరిన వారికి కొంగుబంగారంగా వరాలు ఇచ్చే మహిమ శక్తి దేవత అయినందువల్ల మేడారం వెళ్లే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు.

🌹 🌹 🌹 🌹 🌹



Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page