top of page

మాఘమాసం స్నాన మహత్వం - సువ్రతుడి వృత్తాంతం / The Significance of Bathing in the month of Magha - The Story of Suvrata

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 2 days ago
  • 3 min read

🌹 మాఘమాసం స్నాన మహత్వం - సువ్రతుడి వృత్తాంతం 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 The Significance of Bathing in the month of Magha - The Story of Suvrata 🌹

Prasad Bhardwaj



శుక మహర్షి ఒకప్పుడు పరీక్షిత్తు మహారాజుకు మాఘ మహాత్మ్యాన్ని గురించి చెప్పిన కథను సూత మునీంద్రుడు శౌనకాదులకు చెప్పాడు. మాఘ మాసంలో చేసే స్నాన, దాన, వ్రతాదులు అత్యంత పుణ్యఫలాలను ఇస్తాయని చెబుతూ, అందుకు ఉదాహరణగా సువ్రతుడు అనే బ్రాహ్మణుడి వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు: పూర్వం నర్మదాతీరంలోని సోమనాథం అనే అగ్రహారం ఉండేది.


ఆ అగ్రహారంలో సజ్జనులైన బ్రాహ్మణులు నిత్య వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు. నిత్యాగ్నిహోత్రాలు చేస్తూ, యజ్ఞ యాగాదులు జరిపేవారు. నిత్యం వేదఘోషతో అలరారే ఆ అగ్రహారం సర్వసుభిక్షంగా తులతూగుతూ ఉండేది.


ఆ అగ్రహారంలో సువ్రతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేద వేదాంగాలను; జ్యోతిష తర్క మీమాంసాది శాస్త్రాలను; సంగీతం, శిల్ప, నృత్యాది చతుష్షష్టి కళలను సాంగోపాంగంగా నేర్చుకున్నవాడై, మంత్రశాస్త్రంలో నేర్పరి అయి ఉండేవాడు. ఇవే కాకుండా, తత్త్వ, యోగ శాస్త్రాలను అభ్యసించి, పద్నాలుగు దేశ భాషలలో మాట్లాడటం, చదవడం, రాయడంలో నైపుణ్యం కలిగి ఉండేవాడు.ఇన్ని విద్యలు నేర్చిన సువ్రతుడికి అంతులేని ధనాశ ఉండేది. నేర్చిన విద్యలన్నింటినీ ధనార్జన కోసమే వినియోగించేవాడు. యజ్ఞ యాగాది క్రతువులతో పాటు శుభాశుభ సందర్భాలలో కర్తలు ఇచ్చే గోదాన, హిరణ్య దానాదులు సహా తిలదాన, లవణదానాల వంటి అన్ని రకాల దానాలనూ స్వీకరించేవాడు. అలా విశేషంగా ధనం కూడబెట్టాడు. విశేషంగా వస్తు వాహనాలను సమకూర్చుకున్నాడు.


అంతటితో సంతృప్తి చెందక దానంగా స్వీకరించిన గోవులను అంగడిలో విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. మిగులు ధనాన్ని అవసరంలో ఉన్నవారికి అప్పులుగా ఇచ్చి, అక్రమంగా వడ్డీలు గుంజేవాడు. ఎంత సంపాదించినా, భార్యా పిల్లల కోసమైనా సక్రమంగా ఖర్చు పెట్టేవాడు కాదు. తాను అనుభవించేవాడు కాదు. మితిమీరిన లోభంతో ఇలా లక్షలాది వరహాల ధనాన్ని పోగు చేశాడు.కాలక్రమేణా సువ్రతుడు వృద్ధుడయ్యాడు. కాళ్లు చేతులు పట్లు సడలి; కళ్లు కనిపించక, చెవులు వినిపించక శరీర యాతనతో రోజులు వెళ్లదీస్తూ ఉండేవాడు. అలాంటి దశలో కూడా తాను తినక, ఒకరికి పెట్టక కాలం గడప సాగాడు. సంపాదించి పోగు చేసిన ధనాన్ని ఎక్కడ దాచిపెట్టాడో కనీసం భార్యా కుమారులకైనా చెప్పేవాడు కాదు.


అగ్రహారంలో యజ్ఞయాగాదులు జరుగుతున్నట్లు తెలుసుకున్నప్పుడల్లా, శక్తిలేక మూలపడటం వల్ల అక్కడ తనకు దక్కాల్సిన దానాలు దక్కకుండా పోతున్నాయని బాధపడుతూ ఉండేవాడు.సువ్రతుడు మూలపడటం వల్ల కుటుంబ ఆదాయానికి గండిపడింది. ఇల్లు గడవడం కష్టమైంది. చివరకు అన్న వస్త్రాదులకు కూడా లోటు ఏర్పడే పరిస్థితులు దాపురించాయి. డబ్బు ఎక్కడ దాచిపెట్టాడో చెప్పకుండా ఉన్నందుకు భార్య, కొడుకులు, కోడళ్లు సువ్రతుడిని నానా రకాలుగా నిందించేవారు. కనీసం ఇంటి ఖర్చుల మేరకైనా డబ్బు తీసి ఇమ్మంటే ఇచ్చేవాడు కాదు. పైగా, 'మీరంతా దయ్యాల్లా దాపురించారు. నా ఇంటి నుంచి వెళ్లిపోండి' అంటూ కుటుంబ సభ్యులందరినీ తిట్టిపోసేవాడు.


రోజులు గడిచే కొద్ది పరిస్థితులు గడ్డుగా మారుతుండటంతో సువ్రతుడు ధనం దాచిన చోటు కనిపెట్టాలని ఇంటిల్లిపాది కలసి ఇల్లంతా వెదికారు. చివరకు ఒక బోషాణంలో దాచిన డబ్బు కనిపించింది. ఇక ఆనాటి నుంచి సువ్రతుడి కుటుంబ సభ్యులు ఆ డబ్బును స్వేచ్ఛగా ఖర్చుపెడుతూ, ముప్పూటలా సుష్టుగా భోజనాలు చేస్తుండేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉంటే, ఒకనాటి రాత్రివేళ సువ్రతుడి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్నవాళ్లను తాళ్లతో కట్టేసి, ఇంట్లో ఉన్న డబ్బును, చేతికందిన విలువైన వస్తువులను దోచుకున్నారు. దొంగలు ఇల్లంతా దోచుకుంటూ ఉండటం చూసి సువ్రతుడు బిగ్గరగా రోదిస్తూ, సొమ్మసిల్లిపోయాడు.


తెల్లవారుతూ ఉండగా సువ్రతుడికి స్పృహ వచ్చింది. మళ్లీ ఏడుపు మొదలుపెట్టాడు. 'ఎన్నో తుచ్ఛమైన దానాలు పట్టి ఎంతో ధనం సంపాదించాను. నేనూ తినలేదు, ఎవరికీ పెట్టలేదు. దానంగా స్వీకరించిన గోవును విక్రయించడం మహాపాపం. అయినా, దానంగా లభించిన ఎన్నో గోవులను అంగడిలో డబ్బుకు అమ్ముకున్నాను. దాన ధర్మాలకు ఖర్చు చేయని ధనం దొంగలపాలవుతుంది. నా కర్మ ఇలా కాలింది. ఎన్ని వేదాలు, ఎన్ని శాస్త్రాలు చదివినా ఫలమేమి? ధనాన్ని పోగు చేయాలనే లక్ష్యంతో దేవర్షి పితృతర్పణాలను కూడా ఏనాడూ సమర్పించలేదు. గురువులకు దక్షిణలివ్వలేదు.


నా లోభత్వమే నన్నింతకు దిగజార్చింది. ఇప్పుడు ఏ పుణ్యకార్యం చేద్దామన్నా, ఉన్న డబ్బంతా దొంగలపాలైంది. ముదిమితో ఒంట్లోని జవసత్త్వాలు ఉడిగిపోయాయి. కశ్మీర దేశంలో నేను చదువుకుంటున్నప్పుడు అక్కడ పండితుల వద్ద మాఘపురాణం విన్నాను. మాఘస్నానం వల్ల పాపాలు తొలగిపోతాయి. ఈ స్థితిలో నేను చేయదగ్గ పని మాఘస్నానం మాత్రమే' అనుకున్నాడు.కొడుకులను చేరబిలిచి, తాను చేసిన పాపాలన్నీ ఏకరువు పెట్టి, పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తనను మాఘస్నానం కోసం నర్మదా తీరానికి తీసుకుపోవలసిందిగా కోరాడు. 'మాఘే నిమగ్నాస్సలిలే సుశీతే విధూత పాపా స్త్రి దివం ప్రయాంతి' అని మాఘపురాణం చెబుతోంది.


మాఘమాసంలో చన్నీటి స్నానం చేసినవారికి పాపాలు నశించి, స్వర్గప్రాప్తి కలుగుతుంది.


అందువల్ల నన్ను నర్మదా తీరానికి తీసుకువెళ్లండి' అని కొడుకులకు చెప్పాడు.కొడుకుల సాయంతో నర్మదా తీరానికి చేరుకున్న సువ్రతుడు మాఘమాసంలో పదిరోజులు పవిత్ర స్నానం ఆచరించాడు. ఒకనాడు యథావిధిగా నర్మదానదిలో స్నానం ముగించుకుని, గట్టు మీదకు వచ్చి, దక్షిణముఖంగా పడుకుని గోవిందనామ స్మరణ చేస్తూ, ప్రాణాలు విడిచాడు. అతడి కుమారులు చూస్తుండగానే, దివ్యవిమానంలో దేవదూతలు అక్కడకు వచ్చారు. సువ్రతుడిని తీసుకుని వారు స్వర్గానికి బయలుదేరారు. మాఘస్నానం ఫలితంగా సువ్రతుడు స్వర్గప్రాప్తి పొందాడు.

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹



Join and Follow :




Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page