top of page

శ్రీ దత్తాత్రేయ జయంతి, శ్రీ అన్నపూర్ణ జయంతి, కోరల పౌర్ణమి శుభాకాంక్షలు, Greetings on Sri Dattatreya Jayanti, Sri Annapurna Jayanti Korala Pournami

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 1 day ago
  • 1 min read
ree

🌹. శ్రీ దత్తాత్రేయ జయంతి, శ్రీ అన్నపూర్ణ జయంతి, కోరల పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి, Sri Dattatreya Jayanti, Sri Annapurna Jayanti Korala Pournami Greetings to All 🌹

4 December 2025

ప్రసాద్‌ భరధ్వాజ



🍀 దత్తాత్రేయ జయంతి విశిష్టత 🍀


దత్తాత్రేయని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. అత్రి మహాముని, మహా పతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందునా దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం.


దత్త జయంతి రోజున తెల్లవారు జామునే భక్తులు నదీస్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈ రోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగమార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాదవల్లభ చరిత్ర, నృసింహ సరస్వతి చరిత్ర, శ్రీదత్త దర్శనం వంటివి పారాయణ చేస్తారు. దత్తుని విశిష్టతను స్మరించుకుంటారు. ఈ రోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళలో భజనలు చేస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కురుపురం, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీపాద వల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు. అవధూత దత్త పీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయి వాటిలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి.


🍀 కోరల పౌర్ణమి విశిష్టత 🍀


హిందూ పురాణాల ప్రకారం, కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడట! దీని అర్థం- ఈ సమయంలో యముడు భూలోకంలోని భక్తులపై కరుణ చూపుతాడని, వారి కర్మ ఫలాలను పక్కకు నెట్టి, సకల వ్యాధులు, అనారోగ్య సమస్యలను తన కోరల శక్తితో తొలగిస్తాడని ప్రగాఢ నమ్మకం. ఈ అపమృత్యు భయాన్ని తొలగించినందుకు కృతజ్ఞతగా మార్గశిర పౌర్ణమి రోజున యమధర్మరాజును ప్రత్యేకంగా పూజిస్తారు.


కోరల పౌర్ణమి రోజున ఆచరించాల్సిన అత్యంత విశేషమైన ఆచారం ఒకటుంది. ఆ రోజున మినప రొట్టెలు (కుడుములు) తయారుచేసి, ఆ నైవేద్యాన్ని తల్లి కోరలమ్మకు సమర్పిస్తారు. ఆ తర్వాత, ఆ రొట్టెలో నుంచి ఒక చిన్న ముక్కను కొరికి, శునకాలకు వేస్తారు.శునకం సాక్షాత్తు కాలభైరవుడి వాహనం. యమధర్మరాజుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే, శునకానికి నైవేద్యం పెట్టడం ద్వారా కాలభైరవుడి అనుగ్రహం లభించి, సమస్త దరిద్రాలు, దోషాలు నివారించ బడతాయి అని అంటారు.

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹



Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page