పరమేశ్వరుడు ధరించిన వివిధ స్వరూపాలు నిత్యస్మరణీయాలు The various forms worn by the Supreme Lord are eternally memorable
- Prasad Bharadwaj
- 2 hours ago
- 2 min read
🌹 పరమేశ్వరుడు ధరించిన వివిధ స్వరూపాలు నిత్యస్మరణీయాలు 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 The various forms worn by the Supreme Lord are eternally memorable 🌹
Prasad Bharadwaja
పరమేశ్వరుడి అలంకారాలు, వివిధ ఘట్టాలలో ఆయన ధరించిన రూపాలు అనాదిగా పూజలు అందుకుంటున్నాయి. ఆ ఆకృతులు, వాటి వెనుక ఉన్న పురాణ గాథలు భక్తులకు నిత్యస్మరణీయాలు.
శ్రీశరభమూర్తి: హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి శ్రీహరి... నరసింహ రూపం ధరించాడు. అతణ్ణి వధించాడు. కానీ నరసింహుడి ఉగ్రత్వాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. దేవతలు శివుణ్ణి వేడితే... వీరభద్రుణ్ణి పంపించాడు. ప్రసన్నం కావాల్సిందిగా వీరభద్రుడు ఎంత చెప్పినా నారసింహుడు వినలేదు. అప్పుడు శరభావతారాన్ని శివుడు ధరించి నరసింహుణ్ణి నిర్జించాడు. రెండు తలలతో, ఎనిమిది కాళ్ళతో, రెండు రెక్కలతో ఉండే శరభరూపం ఎంతో భయంకరమైనది. శరభమంత్రం పఠించిన వారికి శత్రునాశనం అవుతుందనే నమ్మకం ఉంది.
శ్రీవీరభద్రమూర్తి: దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం తలపెట్టాడు. అది మంచిది కాదని ఎవరు ఎంత చెప్పినా వినలేదు. అంతేకాదు... యాగానికి తన కుమార్తె దాక్షాయణిని కూడా పిలువలేదు. అయినా తండ్రి తలపెట్టిన యాగానికి వెళ్తానని శివుణ్ణి కోరింది. శివుడు వద్దన్నా ఆమె పట్టువిడువలేదు. అప్పుడు శివుడు... శివగణాలను వెంట ఇచ్చి ఆమెను పంపాడు. అక్కడ యాగంలో... పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావని దక్షుడు ఆమెను అవమానించాడు. దానితో అమ్మవారు యోగాగ్నిలో ప్రవేశించి, దగ్ధమయింది. ఈ సంగతి తెలుసుకున్న శివుడు ఆగ్రహంతో తన జటను తీసి విసిరి కొడితే... అందులోంచి వీరభద్రుడు పుట్టాడు. శివాజ్ఞతో దక్ష యజ్ఞ విధ్వంసం చేసి, దక్షుడి తల నరికేశాడు. ఆ తరువాత శివుడు దేవతల విన్నపం మేరకు... మేక తలను అతికించి.. ప్రజాపతికి ప్రాణం పోశాడు.
శ్రీకంకాళధారణమూర్తి: 'కంకాళం' అంటే ఎముకల గూడు. దాన్ని ధరించినవాడు. శివుడు. కంకాళధారణ మూర్తి చుట్టూ పిశాచగణాలు ఉంటాయి. చేతిలో నెమలి పింఛం ధరించి ఉంటాడు. చూడడానికి ఈ రూపం కూడా భిక్షాటనమూర్తి మాదిరిగానే ఉంటుంది.
శ్రీఏకపాదమూర్తి: ప్రళయకాలంలో పరమేశ్వరుడు ఈ అవతారం ధరించి సృష్టి చేశాడు. ఆయన ఒకే పాదం కలిగినవాడు. బ్రహ్మవిష్ణువులకు మూలమైనవాడు. వారు ఆయననుంచే ఆవిర్భవించారు. ఏకాదశ రుద్రులలో ఏకపాదుడు ఒకరు. కొన్నిసార్లు నాలుగు చేతులతో, మరికొన్ని చోట్ల పదహారు చేతులతో కనిపిస్తాడు. భైరవమూర్తి అవతారానికి ఈ మూర్తి కొనసాగింపు.
శ్రీచండేశానుగ్రహమూర్తి: శివాలయాలలో శివనిర్మాల్యంపై (పూజ అనంతరం తొలగించిన పూలు తదితరాల మీద) అధికారం ఉన్నది ఒక్క చండీశ్వరుడికే. అతడు పరమ శివభక్తుడు. తన ఊరిలోని ఆవులను అడవికి వెళ్ళి మేపి, మళ్ళీ వెనక్కు తీసుకువచ్చేవాడు. రోజూ ఇసుకతో శివలింగం చేసి, దాన్ని ఆవు పాలతో అభిషేకించేవాడు. చండీశ్వరుడు ఆవు పాలను నేలపాలు చేస్తున్నాడని గిట్టనివారు అతని తండ్రికి చెప్పారు. కోపంతో అతను పూజ చేస్తున్న చోటికి తండ్రి వచ్చి... శివలింగాన్ని కాలితో తన్నాడు. చండీశ్వరుడు ఒక కట్టెను తీసుకొని తండ్రి కాలిపై కొట్టగా... అది గొడ్డలిగా మారి రెండు కాళ్ళనూ నరికి వేసింది. చండీశ్వరుడి అచంచలమైన భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. తన మెడలోని దండను తీసి, చండీశ్వరుడి తలపై చుట్టి అనుగ్రహించాడు.
శ్రీవిఘ్నప్రసాదమూర్తి: విఘ్నం అంటే అడ్డంకి. మంచి పనికి విజయం ఎంత అవసరమో, చెడ్డ పనికి విఘ్నం కూడా అంతే అవసరం. ఆ విఘ్నాలకు అధిపతి ఈశ్వరుడే. ఒకసారి పార్వతీదేవి నలుగుపిండితో బొమ్మను చేసి, ప్రాణం పోసి, దారికి కావలిగా ఉంచింది. ఆ కుర్రవాడు చివరకు ఈశ్వరుణ్ణి కూడా లోపలికి పంపలేదు. వారి మధ్య యుద్ధం జరిగింది. ఆ బాలుడి శిరస్సును ఖండించిన శివుడు... పార్వతి వేదన చూసి భరించలేక, గజాసురుడి తలను అతికించి ప్రాణం పోశాడు. విఘ్నాధిపతిని చేశాడు.
శ్రీచక్రప్రదానమూర్తి: శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని అనుగ్రహించినది పరమేశ్వరుడే. పూర్వం మానస సరోవరం దగ్గర రోజూ వెయ్యి కమలాలతో శివుణ్ణి విష్ణువు అర్చించసాగాడు. అది ఒక దీక్షలా కొనసాగింది. విష్ణువు భక్తిని పరీక్షించాలని శివుడు అనుకున్నాడు. ఆ రోజు వెయ్యి పువ్వులలో ఒక పువ్వు తగ్గింది. ఎంత వెతికినా దొరకలేదు. 'పూజ తప్పకూడదు. మరి ఏం చేయాలి?' అని విష్ణువు ఆలోచించాడు. అందరూ తనను 'కమలాక్షుడు' అని పిలవడం గుర్తుకు వచ్చింది. వెంటనే తన కన్నును పీకి... పువ్వులా సమర్పించాడు. ఆ భక్తికి పరవశుడైన శివుడు ప్రత్యక్షమై... విష్ణువుకు చక్రాయుధాన్ని ప్రసాదించాడు.
శ్రీవృషభారూఢమూర్తి: శివుడి వాహనం వృషభం. పూర్వం శిలాదుడు అనే ముని శివుడి గురించి తపస్సు చేశాడు. పుట్టుకతోనే శివభక్తి కలిగిన ఇద్దరు కుమారులను పొందాడు. వారిలో చిన్నవాడు నంది. శివానుగ్రహంతో ఆయన వాహనంగా, శివగణాలకు ముఖ్యుడిగా మారాడు. శివాలయంలో మొదట దర్శనం ఇచ్చే నంది... ధర్మస్వరూపుడు. రెండో శివుడిగా గుర్తింపు పొందినవాడు. నంది వాహనంపై అధిరోహించిన శివరూపమే వృషభారూఢమూర్తి.
శ్రీ దక్షిణామూర్తి: పూర్వం వేదాలను మహర్షులు పరిపూర్ణంగా అధ్యయనం చేసినప్పటికీ... వారికి ఇంకా ఎన్నో సందేహాలు మిగిలే ఉన్నాయి. వాటిని నివృత్తి చేయడానికి ఎవరూ లేకపోవడంతో... కైలాసానికి వెళ్ళి, శివుణ్ణి దర్శించుకున్నారు. వారికోసం శివుడు దక్షిణామూర్తి రూపం ధరించి, మౌనంతో చిన్ముద్ర చూపి, వారి సందేహాలను తీర్చాడు. ఆయన ఆదిగురువు. దక్షిణంవైపు ముఖాన్ని ఉంచి, మర్రి చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఆయనను దర్శించినవారికి విద్య, జ్ఞానం లభిస్తాయి.
ప్రసాద్ భరద్వాజ
🌹 🌹 🌹 🌹 🌹




Comments