బృందావన పుణ్యక్షేత్రం Vrindavan Shrine
- Prasad Bharadwaj
- 3 hours ago
- 2 min read

🌹 బృందావన పుణ్యక్షేత్రం. దర్శించుకోవాల్సిన ముఖ్యమైన 5 ఆలయాలు 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Vrindavan Shrine. 5 Important Temples to Visit 🌹
Prasad Bharadwaja
బృందావనం అంటే తులసివనం. ఇది ఉత్తరప్రదేశ్ మధుర జిల్లాలో యుమునా నది ఒడ్డున ఉన్న పట్టణం. శ్రీ కృష్ణుడు తన బాల్యాన్ని ఇక్కడే గడిపాడని, గోపికలతో రాసలీలలు ఆడిన ప్రదేశం ఇదేనని భాగవతపురాణం చెబుతోంది. బృందావనంలో దర్శించుకోవాల్సిన ముఖ్యమైన 5 ఆలయాలు వున్నాయి. బృందావన నగరం కృష్ణ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా చాలా ముఖ్యమైనది.
పవిత్ర ఘాట్లు , పురాతన దేవాలయాలతో నిండిన బృందావనానికి ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు వస్తారు. బృందావనం కృష్ణుడి లీలలతో ముడిపడి ఉంది, ఇది హిందువులకు ఇది ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ ఐదు దేవాలయాలు వాటి చరిత్ర, వాస్తుశిల్పం , ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందాయి.
బంకే బిహారీ మందిరం
బృందావనంలో ప్రముఖమైన దేవాలయాలలో ఒకటి, ఇది శ్రీకృష్ణునికి అంకితం చేసిన మందిరం. ఇక్కడ ఆయనను బాల రూపంలో పూజిస్తారు. ఈ ఆలయంలో రాధా కృష్ణుల నల్లని విగ్రహాలు ఒక ప్రత్యేకమైన భంగిమలో కొలువై ఉన్నాయి, ఇందులో వారు కొద్దిగా ఒక వైపు వంగి ఉన్నారు, ఆయన పిల్లనగ్రోవి వాయించేటప్పుడు ఎలా ఉండేవారో అలాగే ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన దృశ్యం . ఆలయానికి వెళ్ళేవారు భగవంతుని దర్శనం చేసుకోవడంతో పాటు ఆధ్యాత్మిక స్థితిలో లీనమవుతారు.
నిధివన్.
బృందావనంలో అత్యంత ప్రత్యేకమైన, రహస్య ప్రదేశాలలో ఒకటి నిధివన్, ఇది శ్రీకృష్ణుని లీలలతో ముడిపడి ఉంది. ఇక్కడే బాల్యంలో శ్రీకృష్ణుడు ... రాధ సహా వేల మంది గోపికలతో రాసలీలలు చేసేవాడని నమ్ముతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దాని చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం, ఇది ఒక మాయా శక్తికి తక్కువ కాదు అని చెబుతారు. స్థానికుల అభిప్రాయం ప్రకారం, నిధివన్ లోని వృక్షాలు గోపికల రూపాలు, వారు శ్రీకృష్ణుని దివ్య నృత్యాన్ని చూడటానికి చెట్లుగా మారారని చెబుతారు. ఇక్కడ నిత్యం సాయంత్రం అవగానే ఆలయాన్ని మూసివేస్తారు. రాత్రి సమయంలో ఆ ఆలయంలో ఎవ్వరూ ఉండరు. రోజూ రాత్రివేళ రాధాకృష్ణులు గోపికలతో కలసి నృత్యం చేస్తారని స్థానిక కథనం.
బృందావన్ ప్రేమ మందిరం
దీనిని దివ్య ప్రేమ మందిరం అని కూడా పిలుస్తారు, ఇది జగద్గురు కృపాలుజీ మహారాజ్ 2001 సంవత్సరంలో నూతనంగా నిర్మించిన ఆలయం, ఇది అందమైన పాలరాయితో చూడముచ్చటగా ఉంటుంది. ఈ ఆలయం వాస్తుశిల్పానికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. రాత్రి సమయంలో ఆలయం యొక్క కాంతి ధ్వని ప్రదర్శన చూడదగినదిగా ఉంటుంది.
ఇస్కాన్ దేవాలయం
దీనిని శ్రీ కృష్ణ-బలరామ దేవాలయం అని కూడా పిలుస్తారు. బృందావనంలో ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. యమునా నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షస్నెస్ (ISKCON) ఉద్యమంలో భాగం, దీనిని AC భక్తివేదాంత స్వామి ప్రభుపాద ప్రారంభించారు. ఈ దేవాలయంలో కృష్ణుడు సోదరుడి బలరాముడి విగ్రహాలు ఉన్నాయి.
రాధా రమణ మందిరం
రాధా రమణ మందిరాన్ని 16వ శతాబ్దంలో గోపాల్ భట్ గోస్వామి నిర్మించారు ఇది బందావనంలో ఉన్న పురాతన దేవాలయాలలో ఒకటి. నమ్మకాల ప్రకారం రాధా రమణ విగ్రహాన్ని గోపాల్ భట్ గోస్వామి స్వయంగా పూజించారు.
🌹🌹🌹🌹🌹



Comments